తిరుపతి : టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గతంలో టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని టీటీడీ వర్గాలు తెలిపాయి. టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్సైట్లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్) ఇస్తుంది. ఇలాంటి విషయాలపై టీటీడీ గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇచ్చింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండి అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని టీటీడీ కోరుతోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేసేవారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ వర్గాలు హెచ్చరించాయి.