భారత రక్షణ విభాగంలోని త్రివిధ దళాల్లో నావికా దళానిది కీలక పాత్ర. ఇండియన్ నేవీ సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటాం
- పాకిస్థాన్ పీచమణిచిన భారత నౌకాదళం.
- బంగ్లా ముక్తి పోరాటంలో దాయాదికి చావుదెబ్బ.
- కరాచీ పోర్టుపై మెరుపుదాడితో షాకైన పాకిస్థాన్.
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో భాగంగా దాయాది పాకిస్థాన్తో 1971లో జరిగిన యుద్ధంలో డిసెంబరు 4న భారత నౌకాదళం అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కరాచీ పోర్టుపై మెరుపుదాడిచేసి వారి యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. దీంతో బంగాళాఖాతంలోని పాక్ ప్రాదేశిక జలాలు భారత్ స్వాధీనంలోకి వచ్చాయి. మరోవైపు, వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడిచేసి కకావికలం చేసింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్ నిర్వహిస్తున్నాయి.
రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఈ రోజు ఉత్సవాలను నిర్వహిస్తారు. తీరప్రాంత భద్రతలో నేవీ పాత్ర అత్యంత కీలకంగా మారింది. తీర సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవతా దృక్పథంతో కూడిన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఏటా ఘనంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహిస్తుంటారు.
1971 డిసెంబర్ 4 న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపైన మెరుపుదాడి చేసింది. నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి, బంగాళాఖాతంలో ప్రాదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను కలావికలం చేసింది. భారత సైన్యం ముందు పాక్ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్ 16 న పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది.
ఈ యుద్ధంలో పాకిస్తాన్ జలాంతర్గామి ఘాజీని తూర్పునౌకాదళం విశాఖ సమీపంలో ముంచేసింది. భారత ఉపఖండానికి చెందిన సముద్ర జలాలలో మొదటి జలాంతర్గామి వినాశనం ఇదే తొలిసారి. ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో భారత నౌకాదళం చేపట్టిన కరాచీ రేవుపై దాడి విజయవంతమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 4 - 5 రాత్రి పాకిస్తానీ డిస్ట్రోయర్ నౌకలు దెబ్బతిని సముద్రంలోనే నాలుగు మునిగిపోయాయి. ఇవి భారత నావికాదళ వ్యూహాత్మక విజయానికి తార్కాణంగా నిలిచాయి. 720 మంది పాక్ నేవీ సైన్యం చనిపోగా, దాయాదికి అపార వాణిజ్య నష్టం కలిగింది.
అదే క్రమంలో భారత్ వైపున ప్రాణనష్టం భారీగానే జరిగింది. అరేబియా మహా సముద్రంలో భారత్ ఫ్రిగేడ్ ఐఎన్ఎస్ ఖుక్రీను ముంచివేసినప్పుడు 18 మంది అధికారులు, 176 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళానికి జరిగిన అతిపెద్ద నష్టం ఇదే. పాకిస్తాన్ మాత్రం తన మూడో వంతు నావికాదళ సైన్యాన్ని కోల్పోయింది. పాకిస్థాన్కు చెందిన యుద్ధ ఖైదీలు సుమారు 90 వేల మంది పట్టుబడగా, ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ వీర్, ఐఎన్ఎస్ నిపాట్ ఈ ఆపరేషన్స్లో కీలకపాత్ర పోషించాయి.
తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను పశ్చిమ పాక్ పాలకులు చిన్నచూపుచూడటం.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అవామీ లీగ్ నేత ముజిబూర్ రెహమాన్కి అధికారం అప్పగించకుండా సైనిక ప్రభుత్వం అరెస్ట్ చేయడం.. దీనిపై నిరసన తెలిపిన ప్రజల మీద ఉక్కుపాదం మోపి అణచివేతకు గురి చేయడంతో తిరుగుబాటు మొదలయ్యింది. ముక్తివాహిని పేరిట గెరిల్లా పోరాటానికి దిగారు. అప్పుడు సైన్యం తన అరాచకాన్ని మరింత పెంచడంతో వేలాది మంది శరణార్ధులుగా భారత్లో ప్రవేశించసాగారు.
అప్పటివరకూ ముక్తివాహిని దళాలకు ఆయుధ సహాయం చేస్తూ వచ్చిన భారత్ నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి యుద్ధంలో పాక్ను చావుదెబ్బకొట్టింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో దాయాదిపై ఏమాత్రం నిలువలేకపోయింది.
భారత సైన్యం పదిహేను వేల చదరపు కిలోమీటర్ల పాక్ భుభాగాన్ని చేజిక్కించుకుని, మరుసటి సంవత్సరం తిరిగి ఇచ్చింది.