సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను మాఫీ చేసేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
Andhra News: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకరించింది: వెంకట్రామిరెడ్డి
అమరావతి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 94 ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రభుత్వానికి ఇచ్చామని, వాటిలో 24 మాత్రమే పరిష్కారం అయ్యాయని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాఆడుతూ.. 10ఏళ్ల సర్వీసు దాటిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, 13వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల కోడ్ ముగిశాక ఒక డీఏ ఇస్తామని కమిటీ తెలిపిందని వెల్లడించారు. సీపీఎస్పై కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను కూడా మాఫీ చేసేందుకు కమిటీ అంగీకారం తెలిపిందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపైనా అంగీకారం తెలియజేశారన్నారు. వారికి సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరామని వివరించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఒక్క అనిశా కేసు కూడా లేదన్నారు. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి.. తాను జగన్ బంటునేనని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.