టెస్టు క్రికెట్లో 5 వికెట్లు తీయడం సర్వసాధారణం. అదే రెండు ఇన్నింగ్స్లలో కలిపి 10 వికెట్లు తీయడం.. ఇప్పుడు స్పిన్నర్స్కు ఇదొక ఆనవాయితీగా మారింది.
అయితే ఒక టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీస్తే.. ఆ తీసిన బౌలర్ తోపు అని చెప్పాలి. ఎందుకంటే.! టెస్టు క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి.
గతంలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించగా.. తాజాగా న్యూజిలాండ్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఆ జాబితాలో చేరాడు. జూలై 1956 జూలైలో ఇంగ్లాండ్ బౌలర్ లేకర్ ఆస్ట్రేలియాపై 53 పరుగులకు 10 వికెట్లు తీశాడు. అలాగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్తాన్పై ఫిబ్రవరి 1999లో కుంబ్లే 10 వికెట్లు పడగొట్టగా.. ఇప్పుడు అజాజ్ పటేల్ 119 పరుగులకు 10 వికెట్లు తీశాడు. ఇక ఈ అజాజ్ పటేల్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన భారతదేశంలోనే అతడు పుట్టింది.
ఇదిలా ఉంటే.. అజాజ్ పటేల్.. విదేశీ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్ కాగా.. జిమ్ లేకర్(మాంచెస్టర్), అనిల్ కుంబ్లే(ఢిల్లీ) స్వదేశీ పిచ్లపైనే ఈ ఫీట్ అందుకున్నారు. అజాజ్ పటేల్కు ముంబైతో అనుబంధం ఉంది. అతడు 21 అక్టోబర్ 1988న ముంబైలోనే జన్మించాడు. ఇక అతడికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు, అజాజ్ కుటుంబం న్యూజిలాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్లీ తన సొంత గడ్డపైనే 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇతడు సెలవుల్లో ఇండియాకు వచ్చి ముంబై ఇండియన్స్ తరపున నెట్ బౌలర్గా చేశాడు.
మొదటి నుంచి టీమిండియాకు తంటాలు..
కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ మొదటి నుంచి టీమిండియాను తంటాలు పెట్టాడు. దానితో పాటు అదృష్టం కూడా తోడవ్వడంతో రికార్డు సృష్టించాడు. మొదటి రోజు గిల్ను అవుట్ చేసే అవకాశం వచ్చినా.. టామ్ బ్లండిల్ ఆ క్యాచ్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత బంతికే గిల్ పెవిలియన్ చేరగా.. వెనువెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అజాజ్ ఔట్ చేశాడు. ఇలా తొలి రోజు నాలుగు వికెట్లు దక్కించుకున్న అజాజ్.. రెండో రోజు తొలి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లను రాబట్టాడు. తద్వారా 47.5 ఓవర్లలో 19 మెయిడిన్లు వేయడమే కాకుండా 119 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు.