మూడు నెలలు వరుసగా రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్గా రేషన్ కార్డు రద్దు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Telangana Budget: మీరు బీపీఎల్ కుటుంబాల కిందికి వస్తారా..? మీ కుటుంబానికి తెల్లరేషన్ కార్డు ఉందా..? అయితే ప్రతీ నెలా సరుకులు తెచ్చుకోవాల్సిందే.. కాదని నెగ్లెక్ట్ చేశారో మీ కార్డు క్యాన్సెల్. ఈ వ్యాఖ్యలు సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీపీఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు. 4,88,775 కార్డుల దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రతా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్లో 44 వేల 734 కార్డులు ఇచ్చామన్నారు. మరో 97 వేల కార్డులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కరోనా కారణంగానే కొత్త కార్డులను జారీ చేయలేకపోయామని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే వెరిఫై చేసి ప్రతి ఒక్క అర్హుడికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు.
మూడు నెలలు వరుసగా రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్గా రేషన్ కార్డు రద్దు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు సబ్సిడీ బియ్యం అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.